శ్రీశ్రీ
వికీపీడియా నుండి
(శ్రీ శ్రీ నుండి దారిమార్పు చెందింది)
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి
శ్రీశ్రీ.
శ్రీరంగం శ్రీనివాసరావు
శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ
కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ
రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
శ్రీశ్రీ హేతువాది మరియు
నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు.
మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.
జీవిత గమనం
బాల్యం, విద్యాభ్యాసం
శ్రీశ్రీ -
శ్రీరంగం శ్రీనివాస రావు -
1910
సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు.
శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా ఆయన ఏ తేదీన
పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1,
1910
న జన్మించానని విశ్వసించారు. ఐతే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర
చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని
పేర్కొన్నారు. విశాఖపట్టణం పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30,
1910 అని విరసం వారు స్పష్టీకరించారు.
[1] శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం
విశాఖపట్నం లో చేసాడు.
1925 లో
SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో
మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు.
1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత
ఆకాశవాణి,
ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద,
ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు.
1933 నుండి
1940 వరకు ఆయన రాసిన
మహాప్రస్థానం,
జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి
మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ
మార్చిన పుస్తకం అది.
1947 లో
మద్రాసు
కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ
మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు
లేని కారణం చేత
1949 లో ఒక బాలికను
దత్తత తీసుకున్నాడు.
1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
1955
సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం
నిర్వహించాడు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని
కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది.
1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ
వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి
ఖమ్మంలో
సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు
భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "
రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (
అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు.
1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (
విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై
1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.అదెవిధంగా ఆయన ఇంటిని మహ సంగ్రామ సమర యీచారు
సాహితీ వ్యాసంగం
శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన
18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను
సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక
శైలి,
ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది
గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.
1950 లో
మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది.
మహాప్రస్థానం,
జగన్నాథుని రథచక్రాలు,
బాటసారి,
భిక్షువర్షీయసి
మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నత
స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం,
ఖడ్గ సృష్టి
అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు
రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే
అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు.
1981 లో
లండన్
లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు,
దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు)
కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయం గా రాసాడు. అందులో ఇలా రాసాడు:
- "..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం
అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు
తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక
స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు.
అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "
తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.
ప్రాసకూ,
శ్లేషకు
శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో
శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర
వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు.
ప్రగతి వారపత్రిక లో
ప్రశ్నలు,
జవాబులు (
ప్రజ)
అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక
అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
రచనలు
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి
గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది -
కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు
[1].
శ్రీశ్రీ రచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది
- ప్రభవ - ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ - 1928
- వరం వరం - ప్రచురణ: ప్రతిమా బుక్స్, ఏలూరు - 1946
- సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
- మహాప్రస్థానం - ప్రచురణ: నళినీ కుమార్, మచిలీపట్నం - 1950
- మహాప్రస్థానం - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ (20 ముద్రణలు)- 1952-1984 మధ్యకాలంలో
- మహాప్రస్థానం - శ్రీ శ్రీ స్వంత దస్తూరితో, మరియు స్వంత గొంతు ఆడియోతో - లండన్ నుండి - 1981
- అమ్మ - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు సోషలిస్ట్ పబ్లిషర్స్, విజయవాడ - 1952 - 1967
- మేమే - ప్రచురణ: త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ - 1954
- మరో ప్రపంచం - ప్రచురణ: సారధి పబ్లికేషన్స్, సికందరాబాదు - 1954
- రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
- త్రీ చీర్స్ ఫర్ మాన్ - ప్రచురణ: అభ్యుదయ పబ్లిషర్స్, మద్రాసు - 1956
- చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
- మానవుడి పాట్లు - ప్రచురణ:విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1958
- సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) - ప్రచురణ: అద్దేపల్లి & కో, రాజమండ్రి - 1958
- గురజాడ - ప్రచురణ: మన సాహితి, హైదరాబాదు - 1959
- మూడు యాభైలు - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964
- 1 + 1 = 1 (రేడియో నాటికలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964-1987
- ఖడ్గసృష్టి - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1966-1984
- వ్యూలు, రివ్యూలు - ప్రచురణ: ఎమ్.వీ.ఎల్.మినర్వా ప్రెస్, మచిలీపట్నం - 1969
- శ్రీశ్రీ సాహిత్యం - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ (5 ముద్రణలు) - 1970
- Sri Sri Miscellany - English volumes - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ - 1970
- లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
- రెక్క విప్పిన రివల్యూషన్ - ప్రచురణ:ఉద్యమ సాహితి, కరీంనగర్ - 1971
- వ్యాస క్రీడలు - ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ - 1980
- మరో మూడు యాభైలు - ప్రచురణ:ఎమ్.ఎస్.కో, సికందరాబాదు - 1974
- చీనా యానం - ప్రచురణ: స్వాతి పబ్లిషర్స్, విజయవాడ - 1980
- మరోప్రస్థానం - ప్రచురణ: విరసం - 1980
- సిప్రాలి - (అమెరికాలో ఫొటోకాపీ) 1981
- పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)- ప్రచురణ:శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు - 1983
- శ్రీ శ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
- New Frontiers - ప్రచురణ: విరసం - 1986
- అనంతం (ఆత్మకథ) - ప్రచురణ: విరసం - 1986
శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన
జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు,
రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
- ప్రజ (ప్రశ్నలు జవాబులు) - ప్రచురణ: విరసం - 1990
- తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
- విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
- ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
- ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
ప్రముఖ సినిమా పాటలు
- మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
- హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
- నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
- తెలుగువీర లేవరా (అల్లూరి సీతారామరాజు)
- పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)
మహాప్రస్థానం
మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి
త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవెత్తున లేచి
గర్జించిన సింహం వలె అరిచాడు.
వ్యక్తిత్వం
శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు
కనిపిస్తాయి. ఆయన మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు
సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి ఆయన అభిప్రాయాలు
అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో
ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ
వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి,
మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా
ఎన్నెన్నో ఒడిదుడుకులు ఆయన జీవితాన్ని తాకాయి. ఆయన గురించి
జీవితచరిత్రకారుడు
బూదరాజు రాధాకృష్ణ శ్రీశ్రీతో
ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా
చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు
తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల
విషయంలో అతడు జగమొడి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం.
విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం
లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో
మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త
సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ
వ్యతిరేకిస్తుండేవాడు అంటూ స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించారు.
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ
స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు
ఎన్నో చేశారు. పైగా ఆయన రాసిన ఆత్మకథ
అనంతం సాధారణ పరిస్థితుల్లో
ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు.
సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని
వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా ఆయన ఆకర్షణను ఇసుమంతైనా
తగ్గించలేదు.
శ్రీశ్రీ పలుకులు
తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా
మాట్లాడడం అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒకవిధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు
దొర్లుతూండేవి. చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ
ప్రసిధ్ధి చెందాడు. ఆయన చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు
కొన్ని:
- ఒక మారు గోరాశాస్త్రి శ్రీ శ్రీ తో,"శ్రీ శ్రీ! నువ్వేమిటన్నా అనుకో.నా
ఉద్దేశం మాత్రం ఇది! ఈ నాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ని"
అన్నాడు."నా ఉద్దేశం కూడా అదే!" అన్నారు శ్రీ శ్రీ
- రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు ఆయనను అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీ శ్రీ ఇలా అన్నాడు - "ఊరికే".
- ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా"
- "వ్యక్తికి బహువచనం శక్తి"
- స్నేహితులతో కలిసి మద్రాసు లో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీ శ్రీ "అట్లే కానిండు" అన్నాడు.
- ఒకసారి ఆయనతొ విసిగిన రచయత ఇలా అన్నాడు "శ్రీశ్రీ నీ నిర్వచనాలు ఒట్టి
విరోచనాలు" వెంటనె శ్రీశ్రీ "అవి(విరోచనాలు)నీ నోటెమ్మట రావటం నా అదృస్టం
- తెలుగు భాష గురించి
- తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం.ఇది భాషా దురభిమానంతో అంటున్న
మాటకాదు. తెలుగు భారతదేశం అంతకీ జాతీయభాష కాగల అర్హత గలదని
జె.బి.యస్.హాల్డేన్ అన్నారు. సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణంచేత అటు
ఉత్తరాదివారికీ, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది
వారికీ తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్ పండితుని వాదన. దేశంలో
హిందీ భాషదే మొదటిస్థానమయినా, ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిపి నలభై శాతానికి
మించరు. అంతేకాక హిందీ ఒక చిన్నచెట్టుకు పరిమితం! రెండవ భాష అయిన తెలుగు
సుమారు ఆరుకోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష! పైగా తెలుగువారు దేశమంతటా, అన్ని
రాష్ట్రాలలోనూ వ్యాపింఛి ఉన్నారు.
- తెలుగు కవిత్రయం గురించి
- తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ.
- తెలుగు లిపి గురించి
- ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు
పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే
అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం.
ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను.
--ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196.
- శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల
స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన
గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో ఆయనపై విశ్వనాథ
సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. ఆయన శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన
ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు
అని చెప్పుకున్నారు. 1934లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న
సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్త్వికత, వాస్తవికత
మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం కవితా ఓ కవితా నవ్యసాహిత్య పరిషత్
వేదికపై చదివారు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన
విశ్వనాథ నాటి వర్థమాన కవి అయిన శ్రీశ్రీని ఆనందబాష్పాలతో వేదికపైన
నడిచివచ్చి గుండెలకు హత్తుకున్నారు. ఆ గీతాన్ని ఎంతగానో పొగడి శ్రీశ్రీ
కవితా సంకలనాన్ని(మహాప్రస్థానంగా వెలువడింది) తానే ప్రచురిస్తానని, దీనికి
ముందుమాట రాయాలని చలాన్ని కోరారు. ముందుమాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల
మధ్యవర్తిత్వాన్ని కూడా నెరిపారు. కానీ అప్పటికి విశ్వనాథ పేరున్న కవే
అయినా ఆర్థికంగా ఏ ఆధారంలేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి.
వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల
మహాప్రస్థానాన్ని ఆయన ప్రచురించలేదు. నళినీమోహన్ అని సాహిత్యాభిలాషి
ముద్రించారు.
విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ
కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా
వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి
విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత
ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని
శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే
అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం
చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది
గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడారు.
విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ
కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ.
దీనిపై శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు
శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని, లేని పక్షంలో దీనికి మరోకారణం కనిపించదని వ్యాఖ్యానించారు.
తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ
నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు.
ఈ వాగ్వాదాలకు పరాకాష్టగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో
విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు
విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు.
ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు
పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ
ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి.
మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే
కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని
పాటలను చివరి వరకూ ప్రశంసించారు. ఆయన మరణానంతరం విశ్వనాథను గొప్పగా
ప్రశంసిస్తూ
కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద
అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి
కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు
బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల
దాగుడుమూతలాట సాగింది.
శ్రీశ్రీ గురించి ప్రముఖుల పలుకులు
- "మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి
- "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ" - చలం, యోగ్యతా పత్రంలో
- "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - పురిపండా అప్పలస్వామి
- ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు: "కనీసం
వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత
కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే
అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది"[1]
యోగ్యతా పత్రం
యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో
చలం
రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ
పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది.
"రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం" విని
తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని
సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు
మచ్చుకు:
-
- ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ
పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ
శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు
మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన
కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త
చూస్తారు.
-
- తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని
తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ"
మన్నాడు శ్రీ శ్రీ.
శ్రీశ్రీ నిర్వహించిన
ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా
ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను
అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"
- శ్రీశ్రీ పుట్టుకతొ మనిషి, వృద్దాప్యంలొ మహరిషి, మద్యలొ మాత్రమె కవి,
ఏప్పటికీ ప్రవక్త. ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి
గారు వ్రాసిన వ్యాసం నుండి.)
మూలాలు, వనరులు
- రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.
ఇవి కూడా చూడండి