Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

20, నవంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - మహీధర రామమోహనరావు



వికీపీడియా నుండి
కొల్లాయిగట్టితేనేమి?
Maheedhara ramamohanarao novel cover page kollayi kattitenemi 001.jpg
కొల్లాయిగట్టితేనేమి? పుస్తక ముఖచిత్రం
కృతికర్త: మహీధర రామమోహనరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): తెలుగుప్రాంతంలో జాతీయోద్యమం
ప్రచురణ: నవోదయ, కారల్ మార్క్ రోడ్, విజయవాడ
విడుదల: 1965
పేజీలు: 364

"కొల్లాయిగట్టితేనేమి ?" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. రచయిత మహీధర రామమోహనరావు. ముద్రణ కాలం 1964 అయినా ఇతివృత్తం మాత్రం 1920 నుండి రెండు మూడేళ్ళలో భారత దేశంలో జరిగిన మార్పుల అనుసరణతో రాసాడు రచయిత. 1920 మరియు 1945 మధ్య కాలం చాలా ప్రాముఖ్యత కలిగినది. క్విట్ ఇండియా, సత్యాగ్రహ ఉద్యమాలు, కందుకూరి వీరేశలింగం వంటి వారి వలన ఆంధ్రదేశంలో మారుతున్న పరిస్థితుల ప్రభావాలను, తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్రను శాస్త్రీయమైన అవగాహనతో, అన్ని వైపుల నుంచీ అధ్యయనం చేసి వ్రాసిన రచన.

కథ,పాత్రలు

కథ దాదాపుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోనూ, ఎక్కువగా కోనసీమలోని ముంగండ (పి.గన్నవరం మండలంలోని) ప్రాంతాన్ని వేదికగా చేసుకొని సాగుతుంది. శంకరశాస్త్రి అనే ఒక బ్రాహ్మణకుటుంబంలోని కథానాయకుడి ద్వారా అప్పటి కాలంలో కల అనేక దురాచారాలను, సాంఘిక అసమానతలను కథలో చూపారు.

పాత్రలు

  • రామనాథం (కథానాయకుడు)
  • శంకరశాస్త్రి (కథానాయకుడి తండ్రి)
  • స్వరాజ్యం

ఇతర విశేషాలు

  • ఈ నవల ప్రధమ విశేషం ఏమంటే ఈ రచన చేసి కొల్లాయిగట్టితేనేమి అని పేరుపెట్టిన ఆరు నెలల తరువాత గాంధీజీ కొల్లాయి కట్టటం ఆరంభించడం.(రచయిత వాఖ్యలో)
  • ఈ రచన లోని పాత్రలే రచయిత తరువాతి నవలలైన దేశం కోసం, జ్వాలాతోరణం లలో కొనసాగుతాయి.


19, నవంబర్ 2014, బుధవారం

తెలుగు కవులు - మాడపాటి హనుమంతరావు



వికీపీడియా నుండి
మాడపాటి హనుమంతరావు
Madapati Hanumantha Rao.jpg
మాడపాటి హనుమంతరావు చిత్రపటం
జననం మాడపాటి హనుమంతరావు
జనవరి 22, 1885
కృష్ణ జిల్లా నందిగామ
మరణం నవంబరు 11, 1970
వృత్తి రాష్ట్ర విధాన పరిషత్ మొదటి అధ్యక్షులు
సుపరిచితుడు కవి, రచయిత
మతం హిందూమతం
భార్య / భర్త అన్నపూర్ణమ్మ
మాణిక్యమ్మ
పిల్లలు లక్ష్మిబాయి
సుకుమార్
Notes
ఆంధ్ర పితామహునిగా పేరుగాంచారు.
ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.

వ్యక్తిగత జీవితం

వీరు 1885 జనవరి 22 (తారణ సంవత్సర మాఖ శుద్ధ షష్ఠి) న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేన మామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్టవశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.[1]

రచనారంగం

మాడపాటివారు గొప్ప కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పాడు. హైదరాబాదు నగర తొలి మేయర్. అంతే కాదు, మన రాష్ట్ర్ర విధాన పరిషత్ కు మొదటి అధ్యక్షులు వీరే కావడం, ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం. భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు.
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణాజిల్లా ఒక్కనూరు గ్రామం లో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్రమహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహిం చిన భూమిక ఎన్నదగినది.
పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాల యం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.

మూలాలు

  1. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.


11, నవంబర్ 2014, మంగళవారం

తెలుగు కవులు - కుసుమ ధర్మన్న



వికీపీడియా నుండి

కుసుమ ధర్మన్న
కుసుమ ధర్మన్న తొలి దళిత కవి, వ్యాసకర్త, వక్త. జయభేరి పత్రిక సంపాదకుడు. ఉద్యమకారుడు. వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యుడు. సాహితీ కోవిదుడు. ఆంగ్ల-ఆంధ్ర భాషల్లో పండితుడు. "మాకొద్దీ నల్లదొరతనం" గేయరచయితగా ప్రసిద్ధుడు.
"దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న కవీంద్రుడు" అనే పుస్తకం లో సి.వి. గారు కూడా ఈయన గురించిన సమాచారం తనవద్ద లేదని రాశాడు. 1921లో కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్ల దొరతనము రాశారు. దళిత వర్గం నుంచి అతి కష్టంమీద చదువుకుని పైకొచ్చి, తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతికొద్ది మంది దళిత విద్యావంతుల్లో 'కుసుమ ధర్మన్న కవి' ఒకరు. దళితులు, బ్రిటీషు పాలనలో కంటే, స్థానిక అగ్రవర్ణాల పాలనలో మరింత నలిగిపోతారని మొట్టమొదటగా చాటింది కుసుమ ధర్మన్నే. కాంగ్రెస్‌లో ఉంటూనే 'మాకొద్దీ నల్లదొరతనము' అంటూ గళం విప్పిన ధైర్యశాలి. రాజమండ్రి తాలూకా బోర్డుకు కాంగ్రేసు పార్టీ తరఫున సభ్యునిగా ఎన్నికై కూడా బోర్డు ప్రెసిడెంటు ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి వోటు వేయని స్వతంత్రుడు ఆయన.
ధర్మన్నఅంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితుడై అంబేద్కర్ గురించి ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆంధ్రదేశానికి అంబేద్కరును తొలిగా పరిచయం చేసింది ఈయనే.[1] అణాగారిన జాతులకు గొంతుకనిస్తూ, అంబేద్కర్ భావాలను ప్రచారం చేయటానికి జయభేరి అనే పక్ష పత్రికను స్థాపించాడు.
1930వ దశకంలో కాంగ్రేసు పార్టీ చొరవతీసుకొని హరిజన సేవా సంఘం యొక్క ఆంధ్ర విభాగాన్ని ప్రారంభించింది. మహాత్మా గాంధీ అంటరాని కులాల ప్రజలకు హరిజనులు అని పేరుపెట్టడంతో అది ప్రాచుర్యం పొందింది. క్రమేణా ఆది ఆంధ్ర నాయకులంతా కాంగ్రేసు స్థాపించిన హరిజన సేవా సంఘంలో భాగమైనా కుసుమ ధర్మన్న వంటి కట్టుబడిన నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకించారు. నిమ్న జాతుల అభివృద్ధి విషయంలో మహాత్మా గాంధీ ఆశయాలను నమ్మి గౌరవించినా, ఆచరణలో లోపాలను ధర్మన్న సహించలేదు. గాంధీ యొక్క ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చి హరిజన నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంలో, ధర్మన్న ఆ సమావేశాన్ని బహిష్కరించాడు. 'హరిజన నాయకులైతే మా పేటలకు వచ్చి యిక్కడ మాట్లాడాలని' కబురుపెట్టి గాంధీని, ఇతర కాంగ్రెస్ నాయకులను తమ పేటకు రప్పించి, ఆతిథ్యమిచ్చి దళితుల గౌరవాన్ని చాటాడు.
దళిత చైతన్యం కోసం ధర్మన్న పడిన తపన ఈయన 1933లో వ్రాసిన హరిజన శతకంలో చూడవచ్చు. "ఆత్మ గౌరవంబు నలరంగ చాటరా" అని ఉద్బోధించిన ధర్మన్న కవిగారు వర్ణధర్మం పేరిట భారతీయ సమాజంలో నెలకొని ఉన్న హెచ్చు తగ్గులను నిరసించిన జాతీయ వాది. సమకాలికులు ఆయనను 'ఆది ఆంధ్ర కవి సార్వభౌమ'గా పేర్కొన్నారు.
1936లో విజయనగరంలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభ సమావేశానికి కుసుమ ధర్మన్న అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అధ్యక్ష ప్రసంగం చేస్తూ సామ్యవాదాన్ని సహించని హిందూమతం అనే శీర్షికన ప్రసంగం వెలువరించాడు. ఈయన నిమ్నజాతి విముక్తి తరంగిణి, వాళ్ళు అంటరాని వాళ్లా, హరిజన చరిత్ర మొదలైన రచనలు చేశాడు.

10, నవంబర్ 2014, సోమవారం

తెలుగు కవులు - కుందుర్తి ఆంజనేయులు




వికీపీడియా నుండి
కుందుర్తి ఆంజనేయులు
జననం కుందుర్తి ఆంజనేయులు
డిసెంబర్ 16, 1922
కోటవారి పాలెం, గుంటూరు జిల్లా
మరణం 1982
ఇతర పేర్లు వచన కవితా పితామహుడు
భార్య / భర్త సుందరమ్మ
Notes

వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి మరియు ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రగిలించే తమ కవిత్వంతో తెలంగాణా సాయుధ పోరాటానికి అజ్యం పోసిన కవులలో ప్రముఖుడు.[1]
ఆంజనేయులు 1922, డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కోటవారిపాలెం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన వినుకొండలో చదువుకున్న కాలములో గుర్రం జాషువా ఈయనకు తెలుగు మాష్టారుగా ఉన్నాడు. 1936 నుండి 1941 వరకు విజయవాడ పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే 1937లో కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో ఈయన విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత గుంటూరు ఆంధ్రా కైస్తవ కళాశాల నుండి బి.ఏ పట్టా పుచ్చుకున్నాడు.[2]
ఆంజనేయులు నరసరావుపేటలో నవ్యకళా పరిషత్తు స్థాపించాడు. ఆ కాలంలోనే ఆయన కమ్యూనిష్టు భావాలకు ఆకర్షితుడైనాడు. దేవేంద్రపాడు గ్రామములోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశాడు. ఆ తరువాత కొన్నాళ్ళు గుంటూరు పొగాకు మార్కెట్టులో పనిచేశాడు. 1956లో కర్నూలులో సమాచార ప్రసారశాఖలో అనువాదకునిగా చేరాడు. ఆ తరువాత హైదరాబాదుకు బదిలీ అయ్యాడు. 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించాడు.[3] 1967లో యువతలో వచన కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉత్తమ వచన కవిత్వానికి ఒక బహుమతి ప్రారంభించాడు.[4] 1977లో ఈయన ఉద్యోగ జీవితమునుండి విరమణ పొందాడు.
1944లో కందుర్తి అంజనేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసులతో కలిసి మొట్టమొదటి కవితా సంకలనం నయగారా ప్రకటించాడు. ఈ ముగ్గురూ నయగారా కవులుగా ఆధునిక తెలుగు సాహిత్యములో ప్రసిద్ధి చెందారు. అంజనేయులు సమగ్ర రచనలు 1974లో ప్రచురించబడినవి. కుందుర్తి అనేక పురస్కారాలు అందుకున్నాడు. వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 1969లో అందుకున్న సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారము ప్రతిష్టాత్మకమైనవి.[5]
ఈయన రచనలలో సౌప్తికం, రసధుని, అమవాస్య, నా ప్రేయసి, నయాగర, తెలంగాణ, దండియాత్ర, ఆషా, నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేనుకాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండ, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట మొదలైనవి ముఖ్యమైనవి. వచనాన్ని సాహిత్యముగా పరిగణించని రోజులలో కందుర్తి వచన కవిత్వాన్ని ప్రోత్సహించాడు. కవిత్వము గతమని, వచన కవిత్వము వర్తమానమని చాటాడు.
ఆయన మరణించిన తరువాత ప్రముఖ సాహితీ సమితి రంజని ఆయన పేరిట 1984 నుంచి ఇప్పటి వరకు ఏటేటా వచన కవితల పోటీలు నిర్వహించి అవార్డులు ప్రకటిస్తూ ఉంది. మరణించిన తరువాత కూడా ఆయన యువ కవులకు ఈ విధంగా స్పూర్తిని ఇస్తూ ఉన్నారు.



9, నవంబర్ 2014, ఆదివారం

తెలుగు కవులు - కాళీపట్నం రామారావు


వికీపీడియా నుండి
కాళీపట్నం రామారావు
Kalipatnam Ramarao.jpg
2006 డిసెంబరులో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో కారామాస్టారు
జననం కాళీపట్నం రామారావు
నవంబరు 9, 1924
శ్రీకాకుళం జిల్లాలో పల్లెపట్టు న
నివాస ప్రాంతం శ్రీకాకుళం
ఇతర పేర్లు కారా మాస్టారు
వృత్తి ఉపాధ్యాయులు
సుపరిచితుడు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు
ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకుడుగా బాల్యము , 1940 - 1942 వరకు రాసేందుకు ఆశక్తి ప్రయత్నము .1943 నుండి ఐదేళ్ళు చిన్నచితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలు . 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగాను . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనము . అది ఫలించి 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కథానికలు రాయగలిగేను . ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యనము , అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే వున్నాయి. అభిప్రాయాలు పదిమంది తో పందుకోచడమూ ఆగలేదు
—కాళీపట్నం రామారావు
కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు.
1966లో వీరు రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు.

జీవిత విశేషాలు

కారా మాస్టారుగా పిలువబడే "కాళీపట్నం రామారావు" 1924 లో శ్రీకాకుళం లో జన్మించారు. శ్రీకాకుళం లో S.S.L.C వరకు చదివారు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1943 నుంది 1946 వరకూ నలుగైదు చోట్ల , స్థిరముగా ఇమడగలిగింది ఉపాద్యాయవృత్తిలో 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము . 1972 నుండి నేటివరకు పెన్సనర్ గానే జీవితము గడుపుతున్నారు. కాళీపట్నం రామారావుగారు - ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా రిటైరయ్యారు. కారా మాస్టారు గా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు . ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంధ్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.

రచయితగా

వీరు తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పాడు - ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు. 1964లో వెలువడిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన కథానిలయం విశిష్టమైన యత్నం.[1]
"యజ్ఞం" కథారచయితగా సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడో ఆంప్ర సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు - బ్రహ్మానందరెడ్డి హయాంలో కావచ్చు. ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ ఎవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ ఎవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో ఎవార్డుని స్వీకరించారు. ఎవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి కథానిలయానికి పునాది వేశారు. కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నించి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనక వేపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలున్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిధి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు. పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి. కారామేస్టార్ని కలవండి.

కథానిలయం

కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంధాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంధాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.
1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.
ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు.
ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా భావన.
కథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా నిమగ్నుడై ఉంటాడు. కారా స్వీయ రచనలు వివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురింపబడ్డాయి. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కథానిలయానికే చెందుతుంది.[2]

రచనలు


కారా రచనల ముఖ చిత్రం

8, నవంబర్ 2014, శనివారం

తెలుగు కవులు - కొమర్రాజు లక్ష్మణరావు




వికీపీడియా నుండి
(కొమర్రాజు లక్ష్మణరావు నుండి దారిమార్పు చెందింది)
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
Teluguwriter komarraju lakshmanarao.jpg
జననం మే 18, 1877
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా
మరణం జూలై 12, 1923
మద్రాసు
మరణ కారణము అనారోగ్యం
వృత్తి దివాన్, రచయిత
సుపరిచితుడు చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త
భార్య / భర్త కోటమాంబ
పిల్లలు వినాయకరావు
తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు . తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.

సమకాలీన సాహితీ విప్లవం

"తెలుగు పలుకుల చరితల తెలివి దేర్చి
చదువు సర్వస్వమున వన్నె సంతరియ
మెరపువలె దోచి యక్కటా మింట దాగి
రా కొమర్రాజు లక్ష్మణ రాయ వరులు"
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు తెలుగు భాషను, తెలుగు జాతిని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన నవయుగ వైతాళికులు వారు. [1] [2] [3]
  • కందుకూరి వీరేశలింగం పంతులు (1848-1919): సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించాడు.
  • గురజాడ అప్పారావు (1861-1915): చిన్నకథకు, వచన వ్యావహారిక నాటకానికి ప్రాణంపోసి, దేశమును ప్రేమించమని, మంచిని పెంచమని బోధించిన వెలుగుజాడ.
  • గిడుగు రామమూర్తి పంతులు (1877-1923): తెలుగు వ్రాతలోనే విప్లవం తెచ్చి, వ్యావహారిక భాషకి సాహిత్యంలో పట్టం కట్టిన వాడు. ఈనాడు సర్వసాధారణంగా మనం వ్రాసే భాషకు ఆ హోదా కల్పించడానికి ఆయన పడ్డ శ్రమ అపూర్వం.

జీవితం

1877 మే 18కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాధమిక విద్యను భువనగిరి లో పూర్తిచేశాడు.
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూరు (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరు లో ఉంటూ మరాఠీ భాష ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ. లో ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు మాత్రమే కాక సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్ధిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.
1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం, 1906 లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడం లో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు.
ఈ శ్రమలో ఆయన ఆరోగ్యము బాగా దెబ్బ తిన్నది. 1923 జూలై 12 న, 46 యేళ్ళ వయసులోనే కొమర్రాజు లక్ష్మణరావు మరణించాడు. కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణరావు కూడా మరణించాడు.

రచనారంభం

మహారాష్ట్రదేశంలో సమాచార్, వివిధ విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. కేసరి, మహారాష్ట్ర వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది శుద్ధప్రతిని తయారుచేసి కర్ణపర్వాన్ని ప్రకటించాడు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది.
అయినా ఆంధ్రభాషతో కాని, ఆంధ్రదేశ వ్యవహారాలతో గాని సంపర్కాన్ని కోల్పోలేదు. నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. అప్పట్లో బెజవాడ క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వేంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తికోసం నడిపే "తెలుగు జనానా" పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావులు వ్యాసాలు వ్రాసేవారు. "శివాజీ చరిత్రము" ఆయన మొదటి తెలుగు గ్రంథం. "హిందూ మహా యుగము", "ముస్లిమ్ మహాయుగము" వంటి ఆయన వ్యాసాలు తరువాత "లక్ష్మణరాయ వ్యాసావళి"[4] పేరుతో ప్రచురితమైనాయి.

శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం

కొమర్రాజు లక్ష్మణరావు, రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారు కలసి హైదరాబాదు లోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో 1901 సెప్టెంబర్ 1శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము ను స్థాపించినారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశ్యం. తెలుగునాట అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగినది. ఆదిరాజు వీరభద్రరావు వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు.

విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి

సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి, లక్ష్మణరావు, నాయని వేంకటరంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అప్పటివరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞానశాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చిన ప్రతి పురుషునికి, స్త్రీకి వోటు గలిగిన స్వరాజ్యమే మన గమ్యస్థానం.....పంచముల అస్పృశ్యత రూపుమాపనిది స్వరాజ్యము రానేరదు. .... ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచములో అత్యంతముగా వృద్ధియైన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్ధిక విజ్ఞానములనిచ్చుట ఆవశ్యకము.

విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన "అబ్రహాం లింకన్". దీని ప్రచురణకు ప్రూఫులు దిద్దడం నుండి తొలిపలుకు వ్రాయడం వరకు చాలా భారాన్ని లక్ష్మణరావు నిర్వహించాడు.

మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని:
  • లక్ష్మణరావు స్వయంగా రచించిన హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం
  • డాక్టర్ ఆచంట లక్ష్మీపతి - జీవశాస్త్రం (3,000 ప్రతులు అమ్ముడు పోయాయి), కలరా, మలేరియా (ఇవి రెండూ అనతికాలంలోనే 8,000 ప్రతులు అమ్ముడు పోయాయి)
  • మంత్రిప్రగడ సాంబశివరావు - పదార్థ విజ్ఞాన శాస్త్రం
  • వేమూరి విశ్వనాథ శర్మ - రసాయన శాస్త్రం
  • చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము
  • మైనంపాటి నరసింహం - భౌతిక శాస్త్రం
  • కట్టమంచి రామలింగారెడ్డి - అర్ధ శాస్త్రం
  • దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి - విజయనగర సామ్రాజ్యం
  • వేలాల సుబ్బారావు - రాణీ సంయుక్త
  • భోగరాజు నారాయణ మూర్తి - విమలాదేవి
  • కందుకూరి వీరేశలింగం - స్వీయచరిత్ర
  • వి. శ్రీనివాసరావు - వృక్షశాస్త్రము
1906 - 1910 మధ్యకాలంలో మండలి 30 పైగా గ్రంథాలను ప్రచురించింది. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు హస్తం సోకనిదేదీ లేదంటారు. 1908 లో ఈ సంస్థను మద్రాసుకు మార్చారు.
1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్తు ను స్థాపించారు. గ్రంథ పఠనాభిరుచిని పెంపొందించడం పరిషత్తు లక్ష్యం. అనేక కేంద్రాలలో సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం వంటి రంగాలలో పోటీలు పెట్టి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చేవారు.

ఆంధ్ర పరిశోధక మండలి

1922 డిసెంబర్ 27 న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు కలసి ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను ప్రకటించడం, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ లక్ష్యాలు. తెలంగాణా శాసనాలు, షితాబుఖాను చరిత్ర మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. తరువాత దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. ఈ సంస్థ ప్రస్తుతం నామమాత్రంగా హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయంలో ఉంది.

ఆంధ్ర సారస్వత పరిషత్తు

1916 లో కొవ్వూరు లో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించినవారిలో లక్ష్మణరావు ఒకడు. మొదటినుండి యావజ్జీవ సభ్యుడుగా ఉండడమే కాకుండా, కొంతకాలం దానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 2 ముఖచిత్రం.(తొలిముద్రణ)
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1(కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ)ముఖచిత్రం
లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్‌సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పని చేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు వ్రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ వ్రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాలనుండి సమాచారం సేకరించేవారు.
అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో విజ్ఞానశాస్త్రము, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిద్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు వ్రాశాడు.
ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు.
"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లె లో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12 న లక్ష్మణరావు మరణించాడు.
అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. తర్వాత కాశీనాధుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు. [5] తరువాత డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఏర్పడిన తెలుగు భాషా సమితి ఆ కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక, విషయానుక్రమంగా పద్నాలుగు సంపుటాలు ప్రచురించింది. ఈ సంస్థ 1986 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో విలీనమైంది. ఆ తరువాత ఉర్లాం జమీందారు అయిదు సంపుటాలలో "ఆంధ్ర విజ్ఞానం" అని 1938-1941 కాలంలో ప్రచురించాడు.
సాంప్రదాయక పద్దతిలో విజ్ఞానసర్వస్వం కృషి కొనసాగిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం తో పోల్చితే, ప్రపంచం నలుమూలలనుండి ఆధునిక అంతర్జాల సౌలభ్యంతో వందల మంది సాధారణ తెలుగు భాషాభిమానులు 2003 లో మొదలుకొని నిర్మిస్తున్న తెలుగు వికిపీడియా విలక్షణమైనదని చెప్పవచ్చు.

సంఘ సంస్కరణ, స్వాతంత్ర్యోద్యమం

లక్ష్మణరావు ప్రత్యక్షంగా దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనకపోయినా, ఉద్యమానికి పలువిధాలుగా సంఘీభావం ప్రకటించాడు. ఆయన రచనలలో దేశాభిమానాన్ని ప్రోత్సహించాడు. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నాడు. 1907 కృష్ణా జిల్లా కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా ప్రముఖులను సభకు పిలిపించాడు. 1908 లో ఆయన సహచరుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అరెస్టు కాగా వారి కుటుంబాన్ని లక్ష్మణరావు ఆదుకున్నాడు.
లక్ష్మణరావు సంఘసంస్కరణా కార్యక్రమాలకు తోడు నిలచాడు. బాల్యవివాహాలను గట్టిగా వ్యతిరేకించాడు. వితంతు వివాహం, రజస్వలానంతర వివాహం, భోగం మేళాల నిషేధం, అస్పశ్యతా నివారణ, సముద్రయానం, అంతశ్శాఖా వివాహం వంటి వాటిని ప్రోత్సహించాడు. స్త్రీలలో విద్యాభివృద్ధికి తన సోదరి అచ్చమాంబతో కలసి ప్రయత్నించాడు. రాత్రిళ్ళు హరిజనులకు విద్య నేర్పే కార్యక్రమంలో పాల్గొనేవాడు.

దేశభాషలలో శాస్త్ర పఠనం

లక్ష్మణరావు రచనలలో దేశభాషలలో శాస్త్ర పఠనం అనే వ్యాసాన్ని ప్రత్యేకంగా పేర్కోవాలి. ఈనాటి పరిస్థితులకు కూడా ఈ వ్యాసం నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది. శాస్త్రపఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు అన్నాడు. "ఆంగ్లభాషపై అభిమానమున్నయెడల ఆ భాషను క్షుణ్ణముగా అధ్యయనము చేయవచ్చును, కాని కమ్మరము, కుమ్మరమును అదేభాషలో చదువవలసిన అవుసరమేమున్నది?" అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు.

అలాగే ఔరంగజేబు తన గురువునకు ఉపయోగకరమైన విద్యావసరాల గురించీ, అదీ స్వభాషలోనే జరగాలనీ వ్రాసిన ఉత్తరాన్ని లక్ష్మణరావు పారశీక భాషనుండి తెలుగులోకి అనువదించాడు. ఆ అనువాదానికి అనుబంధంగా లక్ష్మణరావు వ్రాసిన వ్యాఖ్యలు గమనించదగినవి:

బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి, గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రథము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆ భాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటినుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును.... కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.... ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు. [6]

వ్యక్తి కాదు, సంస్థ

లక్ష్మణరావు పంతులు ఒక వ్యక్తికాదు, ఒక సంస్థ అని కురుగంటి సీతారామయ్య తన వ్యాసంలో అన్నాడు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన చరిత్రకారులు, వివిధశాస్త్రవేత్తలు ఆయనద్వారా ఆకర్షితులై 'విజ్ఞానచంద్రికా గ్రంథమండలి' ద్వారా దేశానికి పరిచితులయ్యారు. ప్రధమాంధ్ర చరిత్ర నిర్మాత చిలుకూరి వీరభద్రరావు, రసాయనశాస్త్రవేత్త మంత్రిప్రగడ నరసింహారావు, జీవజంతు వైద్యాలలో నిష్ణాతుడై ఆయుర్వేదానికి అఖిలభారత ప్రచారం కలుగజేసినవారిలో ఒకరైన ఆచంట లక్ష్మీపతి, లక్ష్మణరావు చేత ప్రోత్సాహితులైనవారే.
మొదట రాజకీయోద్యమాలలోను, తరువాత గ్రంథాలయోద్యమంలోనూ జీవితాన్నర్పించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రముఖ ఆంధ్ర రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు, తెలంగాణా నాయకుడు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు, అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకు సేవచేసిన రావిచెట్టు రంగారావు వంటివారు లక్ష్మణరావు సహచరులు.
లక్ష్మణరాయ పరిశోధనామండలి కార్యదర్శిగా తెలంగాణంలో చరిత్ర పరిశోధన సాగించిన ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరావు దగ్గర శిక్షణ పొందినవాడు. ఆర్ధిక శాస్త్రవేత్తగా కట్టమంచి రామలింగారెడ్డి విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి ద్వారా తెలుగుదేశానికి పరిచయమయ్యాడు.
సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగు లోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధమాచార్యులుగా పనిచేశాడు.

ఇతర విశేషాలు

  • లక్ష్మణరావు, ఆయన (సవతి) అక్క బండారు అచ్చమాంబ ల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు. అచ్చమాంబ 18-1-1905 లో మరణించింది.
  • ఇంతటి ఆధునికతను సంతరించుకొన్న లక్ష్మణరావు అభిప్రాయాలు వ్యావహారికభాష వాడకం విషయంలో మాత్రం సంప్రదాయంవైపు మొగ్గు చూపాయి. వైజ్ఞానిక దృక్పథాన్ని విస్తరించడానికి జీవితాన్ని ధారపోసిన ఆయన, విజ్ఞానాన్ని అందరికీ పంచడానికి వ్యావహారికభాష వాడాలని గుర్తించలేకపోయాడు. రచనలలో గ్రాంధిక భాషనే వాడాలని ఆయన అనేకమార్లు నొక్కి వక్కాణించాడు.
  • లక్ష్మణరావు కుటుంబం కృష్ణా జిల్లాకు చెందినది. ప్రాధమిక విద్య తెలంగాణాలో జరిగింది. తరువాత మహారాష్ట్ర ప్రాంతంలో చదివాడు. తెలంగాణా పట్ల లక్ష్మణరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. ఆయన హైదరాబాదులో ప్రారంభించిన సంస్థలవలన ఆధునిక తెలుగు భాష వికాసానికి తెలంగాణా ప్రాంతంలో పునాదులు పడ్డాయి. పోతన నివాసస్థలం అయిన ఏకశిలానగరం, కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని, వరంగల్లు అని సహేతుకంగా నిరూపించాడు. త్రిలింగాలలో ద్రాక్షారామం, శ్రీశైలం లతోబాటు మూడవది శ్రీకాళహస్తి కాదని, మంథని దగ్గర ఉన్న కాళేశ్వరమ ని మొదటిసారి చెప్పినది ఈయనే. ఒక సందర్భంలో ఈయన ఇలా అన్నాడు - ఆంధ్ర దేశమును గురించియు, ఆంధ్ర రాజులను గురించియు, ఆంధ్ర వాఙ్మయమును గురించియును ఎక్కుడు పరిశోధనలను జేసి, క్రొత్తవింతలను కనుగొనదలచినవాఱికి హైదరాబాదు రాజ్యమందలి తెలుగు భాగమొక బంగారపు గని
  • మహారాష్ట్ర ఆచార వ్యవహారాలు లక్ష్మణరావుకు బాగా అలవాటయ్యాయి. ఆయన తలగుడ్డ, పొడుగుకోటు, ఉత్తరీయం వేసుకొనే విధానం అలాగే ఉండేవి. తన కుమారునకు వినాయకరావు అని పేరు పెట్టాడు. ఆయన మొదటి గ్రంథం శివాజీ మహారాజు చరిత్ర. - ఒకసారి ఆయన - ఈ మరాఠీవారెప్పుడును ఇట్టి పట్టుదలయు, దేశాభిమానము గలవారు అని వ్రాసాడు.
  • లక్ష్మణరావు ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో క్రొత్తగా వాడాడు. వీటిలో చాలావరకు మరాఠీ వాడకంనుండి గ్రహించినవి - విశ్వ విద్యాలయం, సంపాదకుడు, శిక్షణ, రాష్ట్రీయ అటువంటి కొన్ని పదాలు.
  • 46 ఏండ్ల వయసులో, ఆంధ్రసంపుటం వ్రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే, కందుకూరి వీరేశలింగం మరణించిన ఇంటిలో, అదే గదిలో, లక్ష్మణరావు మరణించాడు.
  • భారత భాషలలో విజ్ఞాన సర్వస్వం ఆరంభమైంది తెలుగు లోనే. తర్వాత 1915 లో మరాఠీ లో విజ్ఞాన సర్వస్వం ఆరంభమై 21 సంపుటాలలో 1927నాటికి పూర్తి అయ్యింది. బెంగాలీ లో విశ్వకోశం అనే పేరిట విజ్ఞాన సర్వస్వం తర్వాత ప్రచురితమైంది. మిగతా అనేక భాషలలో ఆ ప్రయత్నం అలా కొనసాగడానికి మునుముందే తెలుగులో ఆ బృహత్కార్యాన్ని లక్ష్మణరావు ఆరంభించాడు.
  • తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువరానిది. ప్రత్యేకించి తెలుగు వికీపీడియా కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ఆయన చేసిన సేవ స్మరణీయము.
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము లో విజ్ఞానసర్వస్వ కేంద్రమునకు లక్ష్మణరావు పేరు పెట్టారు.
  • క.రామానుజరావు అనే కలంపేరు కథానికలు రాశారని తెలుగులో మారు పేరురచయితలు -కె.సి అశోక్ కుమార్, ప్రొఎ.ఎ.ఎన్ రాజు పుస్తకం ప్రవేశిక వ్యాసంలో కె.కె.రంగనాథాచార్యులు పేర్కొన్నాడు. [7]