జాషువ పద్యాలు
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపురే
ఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళి యన్నవాడె "మీ
దేకుల?"మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో
బాకున గ్రమ్మినట్లగును పార్ధివ చంద్ర! వచింప సిగ్గగున్.
కులమతాలు గీచుకొన్న గీతల చొచ్చి
పంజరాన కట్టుపడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను.
కవి దిగ్గజంబన్నఘనమైన బిరుద మ
ర్పించె నాకుం జెళ్ళపిళ్ళ సుకవి
కవి చక్రవర్తి సత్కవి కోకిలం బన్న
బిరుదాళి శిరమున దురమి కొమ్ము
టేనుంగు మీద నూరేగించి కనకాభి
షేకంబు చేసి యాశీర్వదించి
సకలాంధ్ర సీమంబు సన్మానంబులు చేసె
వేలు వేల్ విశ్వ విద్యాలయాలు
సుకవిగా గ్రంధ కర్తగా సుప్రతిష్ఠ
.................................
.................................
.................................
గవ్వకుసాటిరాని పలుగాకుల మూకలసూయచేత న
న్నెవ్విధి దూరినన్, నను వరించిన శారద లేచిపోవునే?
ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు, ఘంటమూనెదన్
రవ్వలురాల్చెదన్, గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.
పురుషుల్ నిర్మితిచేయు సాంఘిక మహాభూతంబు పెంగోరలం
దిరికింపంబడి దుష్టభర్తల కృపాహీన ప్రవృత్తుల్ హృదం
తరమున్ ఱంపపుకోతగోయు నిజ హత్యా నేరముల్ చేయు సుం
దరుల న్నీ వెటులూరడింతువొ మహాత్మా ! ప్రేమవారాన్నిధీ
(ఝషువ - క్రొత్తలోకము)
"గబ్బిలం" నుంచి కొన్ని పద్యాలు
పదవుల పీటలెక్కి యనువారము లంచపు బాడి బఋఋఎలం
బిదిగిగడించి కార్మికుల పేదల చెమ్మటదెచ్చి కాన్కలి
చ్చెదరు పరోపజీవులు, విచిత్రపు భక్తులు వేషధార్లు నీ
కెదురయి వచ్చిరే వెలది నీచెయి సాచకుమమ్ము పక్షిణీ !
పూడునా కూటి కల్లాడు పేదలడొక్క
ముప్పూట లభిమతంబులుఫలింప
నడుచునాధర్మంబు నాల్గుపాదములతో
కులతత్వముల గాలికుంటులేక
ఓరి! దురాత్మా ! బిడ్డలు
లేరా ! ఒక్కింత కరుణలేదా ? మమ్మున్
నోరెరుగనట్టి నిసుగుల
గారించుట నీకు వేడుకా? దౌష్ట్యంబా !
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు గొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి ! పూజారి లేని వేళ
విన్నవింపుము నాదు జీవిత చరిత్ర.
ధర్మమునకు బిఱికి తన మెన్నడును లేదు
సత్యవాక్యమునకు జావు లేదు
వెఱవనేల నీకు విశ్వనాధుని మ్రోల
సృష్టికర్త తాను సృష్టి వీవు.
పాపాయి పద్యములు
బొటవ్రేల ముల్లోకములు జూపి లోలోన
ఆనందపడు నోరు లేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరి ద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిది నెలల పంట
అమృతమ్ము విషమను వ్యత్యాసమెరుగ
కాస్వాదించ చను వెర్రిబాగులాడు
యనుభవించు కొలంది యినుమడించుచు మరం
దము జాలువారు చైతన్యఫలము
భాషరాదు, వట్టి బాలు మాత్రమె త్రాగు
నిద్రపోవు, లేచి నిలువలేడు,
ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు
నవమాసములు భోజనము నీర మెఱుగక
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి జిమ్ము జానెడు బొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా దెచ్చుకొన్న యతిధి
నును జెక్కిలుల బోసినోటి నవ్వులలోన
ముద్దులు జిత్రించు మోహనుండు
బట్టగట్టడు, బిడియాన బట్టు వడడు,
ధారుణీ పాఠశాలలలో జేరె కాని
వారమాయెనొ లేదొ మా ప్రకృతి కాంత
తరపి యున్నవి వీని గాకలియు నిద్ర
గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలుక
పొడవు కండలు పేరుకొను పిల్ల వస్తాదు
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఊ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
రసవబ్ధి తరియింప వచ్చిన పరదేశి
తన యింటి కొత్త పెత్తనపు ధారి
ఏమి పని మీద భూమికి నేగినాడొ
నుడువ నేర్చిన పిమ్మట నడగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ గాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు
ఊయేల తొట్టి యేముపదేశమిచ్చునో
కొసరి యొంటరిగ నూ కొట్టు గొనును
అమ్మతో తనకేమి సంబంధమున్నదో
యేడ్చి యూడిగము జేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా గేకిసల్ కొట్టుకొనును
మూన్నాళ్ళలోనె ఎప్పుడు నేర్చుకొనియెనో
బొమ్మన్నచో చిన్న బుచ్చుకొనును
ముక్కు పచ్చలారిపోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నపుడు
నాదు పసిడి కొండ నారత్నమని తల్లి
పలుకు, పలుకులితడు నిలుపుగాక